దావోస్‌లో హిమపాతం హెచ్చరిక

దావోస్‌లో హిమపాతం హెచ్చరిక

స్విట్జర్లాండ్‌లో హిమపాతం హెచ్చరికలు జారీ చేశారు. స్విస్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేత్తల సదస్సు ప్రారంభం కానున్న తరుణంలో హిమపాతం హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. దావోస్‌లోని మంచు, హిమపాతాల రీసెర్చ్‌ కేంద్రం ఎస్‌ఎల్‌ఎఫ్‌ ఈ హెచ్చరికలు జారీ చేసింది. ప్రమాదకరమైన లెవెల్‌ 5 హిమపాతాలు సంభవించే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

మంచు విపరీతంగా పడే అవకాశముందని, పెద్ద సంఖ్యలో మంచు తుపానులు సంభవించే ప్రమాదముందని తెలిపింది. మంచు బాగా పేరుకుపోతే  ప్రయాణాలకు ఇబ్బంది కలిగే అవకాశముందని వెల్లడించింది. దావోస్‌లో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల నుంచి సుమారు రెండు డజన్ల మంది ప్రజలను అధికారులు వేరే చోటుకు తరలించారు. మంచు కారణంగా జర్మట్‌ అనే నగరానికి రోడ్డు, రైలు మార్గాల ద్వారా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో హెలికాప్టర్ల ద్వారా సహాయక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రపంచ ఆర్థిక వేత్తల సదస్సుకు హాజరయ్యేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ దావోస్‌ వెళ్లిన సంగతి తెలిసిందే.


Comments