త్వరలో విమానాల్లో వై-ఫై సేవలు.. కానీ ఓ కండిషన్!


త్వరలో విమానాల్లో వై-ఫై సేవలు.. కానీ ఓ కండిషన్!


విమాన ప్రయాణికులకు త్వరలోనే వై-ఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. కానీ దీనికి 20 నుంచి 30 శాతం చార్జీలను అదనంగా వసూలు చేయనున్నారు. టెలికమ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాలతో విమానాల్లో అంతర్జాల సేవలను అందించడానికి విమానయాన సంస్థలు అంగీకరించాయి. అయితే ఈ సదుపాయం కేవలం దేశీయ, అంతర్జాతీయ సర్వీసుల్లో బిజినెస్ క్లాస్ టిక్కెట్లకు మాత్రమే అందుబాటులోకి రానుంది. విమానంలో ఉన్నప్పుడు 30 నిమిషాల నుంచి గంట వరకు నెట్ వినియోగిస్తే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం రూ.500 నుంచి రూ.1,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలియజేశారు.

దేశీయ రూట్లలో ముందస్తు బుకింగ్ చేసుకునేవారికి టిక్కెట్ ధర రూ.1,200 నుంచి రూ.2,500 మధ్యలో ఉంటుంది. వీరికి ఒకవేళ అంతర్జాల సౌకర్యం కావాలంటే టిక్కెట్ ధర కంటే దీనికే ఎక్కువ ఖర్చవుతుంది. ట్రాయ్ నిబంధనల ప్రకారం విమానాల్లో అంతర్జాల సౌకర్యం కల్పిస్తే అంతర్జాతీయ ప్రయాణికులకు ఉపయోగం ఉంటుందని ఎయిర్‌లైన్ అధికారులు పేర్కొన్నారు. దేశీయ విమానాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి తేవడంపై చర్చించాల్సి ఉందని, నిర్ణయం తీసుకునే ముందు ఖర్చు, డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఓ ప్రయివేట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన అధికారి వ్యాఖ్యానించారు. నెట్ సౌకర్యం కోసం విమానాల్లో ఏంటెన్నా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. వీటి ద్వారా ఉపగ్రహాల నుంచి సిగ్నల్స్ అందుతాయి.

విమానాల్లో అంతర్జాల సేవల వల్ల సుదూర ప్రాంత ప్రయాణికులకు ఉపయోగం ఉన్నా, కానీ అంతర్జాతీయ మార్గాల్లో దీని గురించి కోరడం అరుదుగా ఉంటుందని ఎయిర్ ప్యాసింజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో దీని వల్ల చాలా ఉపయోగం ఉంటుందని ఆయన అన్నారు. కొన్ని విమానయాన సంస్థలు ఇప్పటికే ప్రయాణికులకు వాట్సాప్, మెసేజ్ కోసం ఉచితంగా వై-ఫై సేవలు అందిస్తున్నాయి. లుఫ్తాన్సా, ఎమిరైట్స్, బ్రిటిష్ ఎయిర్‌వేస్, డెల్టా లాంటి అంతర్జాతీయ విమాన సంస్థలు అందుబాటులోకి తీసుకొచ్చాయి.


Comments