పాక్ దురాగతం! కుల్భూషణ్ భార్యతో బొట్టు తుడిపించారు..తాళి తీయించారు..!
గూఢచర్య ఆరోపణలపై పాకిస్థాన్లో మరణశిక్షను ఎదుర్కొంటున్న మనదేశ నౌకాదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ భార్య పట్ల ఆ దేశ అధికారులు అమానవీయంగా వ్యవహరించారు.భర్త జీవించి ఉండగానే.. ఆయనను కలుసుకోవడానికి వెళ్తున్న సమయంలోనే.. కుల్భూషణ్ జాదవ్ భార్య ధరించిన తాళిబొట్టును తీయించారు. నుదుట బొట్టును తుడిపించేశారు.సోమవారం ఇస్లామాబాద్లో కుల్భూషణ్ జాదవ్ తల్లి అవంతి, భార్య చేతన్కుల్ ఆయనను కలిశారు. మంగళవారం వారిద్దరూ ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ను కలిశారు.ఈ సందర్భంగా పాక్ అధికారుల దురాగతాన్ని వారు సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకొచ్చారట. ఢిల్లీ నుంచి బయలుదేరి దుబాయ్ మీదుగా ఇస్లామాబాద్ చేరుకున్నాక కుల్భూషణ్ను కలవడానికి ముందు అక్కడి అధికారులు చేతన్కుల్ నుంచి చెప్పులు తీసుకున్నారట.మంగళసూత్రం, నుదుటన బొట్టు తొలగించాల్సిందిగా డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు. కుల్భూషణ్తో మాతృభాషలో మాట్లాడనివ్వలేదని ఆయన్ని కలిసేముందు దుస్తులు మార్చుకోవాల్సిందిగా బలవంతం చేశారని సమాచారం.కుల్భూషణ్ భార్య, తల్లితో మాట్లాడుతున్నప్పుడు తీసిన ఫొటోలో అతని చెవి, మెడ వద్ద గాయాలు కన్పించాయని చేతన్కుల్ సుష్మాస్వరాజ్కు వివరించారని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.






Comments
Post a Comment