ఐసిస్‌లో చేరిన కేరళ వ్యక్తి సిరియాలో మృతి

ఐసిస్‌లో చేరిన కేరళ వ్యక్తి సిరియాలో మృతి


ఉగ్రవాద భావజాలానికి ప్రేరేపితుడై ఇస్లామిక్‌స్టేట్‌లో చేరిన కేరళకు చెందిన ఓ యువకుడు సిరియాలో మృతిచెందాడు. ఐసిస్‌ కోసం పోరాడుతూ గత నవంబరులోనే అతను చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.

కన్నూర్‌ జిల్లాలోని వలపట్టినమ్‌కు చెందిన అబ్దుల్‌ మనఫ్‌(30) గతేడాది నవంబరులో సిరియాలో చనిపోయాడని సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు తెలిపారు. అయితే అబ్దుల్‌ మృతి వార్త ఈ నెల 17నే అతడి కుటుంబసభ్యులకు తెలిసిందని చెప్పారు. సిరియాలో ఉండే అబ్దుల్‌ స్నేహితుడు ఖయ్యు్మ్‌ టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా ఈ విషయాన్ని చెప్పినట్లు వెల్లడించారు. కాగా.. ఖయ్యుమ్‌ కూడా ఐసిస్‌ కోసమే పోరాడుతున్నట్ల సదరు అధికారి తెలిపారు.

అబ్దుల్‌ కేరళకు చెందిన పాపులర్‌ ఫ్రంట్‌ ఇండియా నాయకుడు. అయితే ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితుడై ఐసిస్‌లో చేరినట్లు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. అబ్దుల్‌ సహా కేరళ నుంచి మరికొందరు యువకులు కూడా ఐసిస్‌లో చేరి సిరియా వెళ్లారు. వీరిలో ఇప్పటికే ఆరుగురు చనిపోయినట్లు తెలుస్తోంది.

Comments